గండరగండల గుండెల మోత... కొండవీడు కోట - Raka Lokam

గండరగండల గుండెల మోత... కొండవీడు కోట

Share This

కొండవీడు .....ఆ పేరు వినగానే గుండెల్లో ఏదో తెలియని సంచలనం...
కొండవీడు....ఆ పేరు చెప్పగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి....
శరీరం కంపిస్తుంది....
కొండవీడు అంటే చాలు తెలుగువాడి పౌరుషం....పరాక్రమం ఒక్కసారి మేల్కొంటుంది.....
శతాబ్దాల కింద పరకీయుల పాదముద్రలు పడి తెలుగునేల అపవిత్రమైపోయినప్పుడు....
మనదైన జీవన విధానం మంటగలిసిపోయినప్పుడు.....అక్కడి కొండరాళ్లు....అక్కడి బండరాళ్లే ఒక మహాపోరాటానికి....మహావిప్లవానికి వేదికలయ్యాయి....
రెడ్డిరాజుల నాయకత్వంలో పరకీయులపై ఒక ప్రజాతిరుగుబాటు ప్రారంభం అయింది.
రెడ్డి రాజులు ఈ కొండలనే తమ వీడు గా....అంటే స్థావరంగా చేసుకున్నారు....సమరశంఖం పూరించారు...
ఈ కొండవీడుపై కట్టిన కోటే వారి రాజధాని....

కొండవీడు పైకెక్కుతూంటే ఒక వైపు పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాలు కనిపిస్తాయి....శతావ్దాల కిందట రెడ్డి రాజులు నిర్మించిన కోట ఆనవాళ్లు కనువిందు చేస్తాయి....
అయినా దారి చాలా దుర్గమం....ప్రమాద కరం....జారిపడితే అంతే......



1325లో రెడ్డి రాజులు అద్దంకి నుంచి తమ రాజధానికి కొండవీడుకు మార్చారు. కొండవీడుపై అడుగుమోపిన తొలి రెడ్డి రాజు ప్రోలయ వేమా రెడ్డి....ఆయన హయాంలోనే ఇక్కడ ఒక శత్రుదుర్భేద్యమైన కోట ఊపిరులు పోసుకుంది....రెడ్డిరాజుల్లో రెండవవాడైన అనపోతారెడ్డి ఈ కోటను కట్టించాడు......అప్పట్లో ఈ ప్రాంతానికి కిండిన నగరం, గోపీనాథ పురం, మోర్తజా నగర్‌ అన్న పేర్లు కూడా ఉండేవి....
కొండవీటి ప్రాంతంలో మూలాంకురేశ్వరి దేవాలయం, ఫిరంగిపురం వీరభద్రస్వామి దేవాలయం వంటి ఎన్నో మందిరాలున్నాయి....కొన్ని పూర్తిగా శిథిలమయ్యాయి....
పగిలిపోయిన దేవతా మూర్తులు, రోళ్ళు, బావులు, కట్టడాలు ... ఇలాంటివి ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి.
ఇక్కడి ఒక్కో బురుజుకూ ఒక్కో పేరు ఉంది....ఉదాహరణకు రాణిగారి బురుజు, నెమళ్ళ బురుజు, ఆళ్ళవారి బురుజు, బ్రహ్మదేవుని బురుజు, తిరుమలయ్య బురుజు .
అలాగే పుట్టలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు, ముత్యాలమ్మ చెరువు వంటి చెరువులు కనిపిస్తాయి....
నేతిని నిలువ చేసే నేతి కొట్టు, రెడ్డిరాజుల్ని మోసంతో చంపించిన కత్తుల బావి, శ్రీనాథ కవి సార్వభౌముని శాసనం వంటి చారిత్రిక ప్రదేశాలూ ఉన్నాయి.....
కొండవీటిలో అన్నిటికన్నా ఆసక్తిని కలిగించేవి ఇక్కడి బావులు....ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఇప్పటికీ ఊహకందదు...
వీటినుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళ్ళు వాడేవారు. అందుకే కొండవీటి చాంతాళ్ళు అన్న నానుడి వచ్చింది.



రెడ్డి రాజుల పాలన తరువాత ఈ కోట నిర్లక్ష్యానికి గురైంది.....ఇప్పుడిప్పుడే కోట అభివృధ్ధికి ప్రయత్నాలు మొదలయ్యాయి.....
2004లో ఘాట్‌ రోడ్‌ నిర్మాణానికి సర్వే మొదలైంది......దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృధ్ధి చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి.
కొండవీటి కోట అభివృద్ధి కోసం స్థానిక స్వచ్ఛంద పురావస్తు కార్యకర్త కల్లి శివారెడ్డి నాయకత్వంలో ఒక అభివృధ్ధి కమిటీ కూడా ఏర్పడింది.....శివారెడ్డి అలుపెరగకుండా పనిచేస్తున్నారు.

గుంటూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట ఒక చారిత్రిక సంపద....మన గుండెల్లో స్వాభిమానాన్ని రగుల్కొలిపే మహత్తర కట్టడం.....
మనమేమిటో....మన గతమేమిటో...ఆ గతమెంత ఘనమైనదో....ఆ గతం మన భవిష్యత్తుకు ఎలా బాటలు వేస్తుందో చెబుతుంది ఈ కొండవీటి కోట...దీన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం...

1 comment:

  1. gajapatulu,vijayanagara rajulu mukyamugaa sri krishna deva rayalu palinchina visheshalu kudaa cheppalsindi.

    ReplyDelete

Pages