కొండను తవ్వి.... - Raka Lokam

కొండను తవ్వి....

Share This


దశరథ్ కి కోపం వచ్చింది ...

ఎవరి మీద?

కొండ మీద...

ఎందుకు కోపం వచ్చింది?

అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు...



అవును
కొండకు అటువైపు తన గ్రామం అత్రి ఉంది.

కొండకు ఇటువైపు వాజరంగ్ గ్రామంలో తన పొలం ఉంది.

పొలానికి వెళ్లాలన్నా, అడవిలో కట్టెలు కొట్టాలన్నా కొండను దాటాల్సిందే... చెమటలు కక్కాల్సిందే..

రోజూ మధ్యాహ్నం భార్య ఆహారం తేవాలన్నా ఈ కొండ ఎక్కి రావాల్సిందే.


ఒక రోజు ఆమె భోజనం తెస్తూండగా ఒక బండరాయి కాలికి తగిలి ఆమె పడిపోయింది. ఆమెకు దెబ్బలు తగిలాయి. అన్నం ముంత పగిలిపోయింది.

అందుకే ...

దశరథ్ కి కోపం వచ్చింది.

ఎవరి మీద?

కొండ మీద.

ఎందుకు కోపం వచ్చింది?

అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు...


దశరథ్ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులతో ఈ కొండను తొలిచి దారిని నిర్మిద్దాం అన్నాడు.

"అసాధ్యం" అన్నారు అంతా.

దశరథ్ కోపం మాత్రం చల్లారలేదు.

ఉత్తి తీసుకున్నాడు. కొండరాళ్లను బద్దలు గొట్టడం మొదలుపెట్టాడు. పొలం పని, ఇంటి పని పోను మిగతా పగలంతా పగలగొట్టడమే పని.

రాళ్ల కింద మంట పెట్టడం....

పగుళ్లు రాగానే వాటిని బద్దలుచేయడం ...

ఇదే పని....

ఆ దశరథుడు పుత్రకామేష్టి చేసినంత నిష్ఠకా ఈ బీహారీ దశరథుడు "పత్థర్" కామేష్టి చేశాడు.


బండలు బద్దలయ్యాయి...

కొండలు పిండి అయ్యాయి.


చివరికి ...

కొండ రెండుగా చీలి .... దశరథ్ కి దారి ఇచ్చింది. కిలో మీటర్ల దూరం చెరిగిపోయింది.

ఇప్పుడు అత్రి, వాజరంగ్ ల మధ్య 350 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉన్న దారి ఏర్పడింది.

దారి పొడవునా దశరథ్ చెట్టు నాటాడు. ఆ మొక్కలు పెరిగి మహావృక్షాలయ్యాయి.

కొండను తవ్వి దారిని దొరకబట్టడానికి దశరథ్ కి ఒకటి కాదు ... రెండు కాదు ... ఏకంగా 27 ఏళ్లు పట్టింది.

ప్రజలూ, ప్రభుత్వం దశరథ్ కి బ్రహ్మరథం పట్టాయి. అవార్డులు,రివార్డులు వచ్చాయి.


వాల్మీకి శోకం శ్లోకమైంది....

దశరథ్ కోపం కొండదారి అయ్యింది. ....


అయితే దశరథ్ కి ఇప్పటికీ కోపం వస్తుంది.

ఎవరి మీద?

అసమర్థుల మీద.

ఆత్మవిశ్వాస రహితుల మీద ....

ఎందుకు కోపం వస్తుంది?

అసాధ్యం, అసంభవం అని చేతులు ముడుచుకున్నందుకు .....

ఆత్మశక్తిపై అపనమ్మకం ఉన్నందుకు .....






(ఇది బీహార్ కి చెందిన దశరథ్ మాఝీ అనే రైతు కథ. నిజంగానే జరిగింది)

No comments:

Post a Comment

Pages