దాద్రీ ... అఖ్లాక్... ఓ హత్య... బోల్డన్ని కట్టుకథలు - Raka Lokam

దాద్రీ ... అఖ్లాక్... ఓ హత్య... బోల్డన్ని కట్టుకథలు

Share This




భారత దేశం జనాభా నూటపాతిక కోట్లు. దేశంలో గ్రామాలు దాదాపు ఆరు లక్షలు. కానీ దేశంలోని ఒక వర్గం మీడియాకి, కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులకు, తమకు తాము మేథావులు అని బిరుదులిచ్చుకున్న ఓ గుప్పెడు మందికి మాత్రం ప్రస్తుతం భారత్ అంటే ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్ సీ ఆర్) కి చేరువలో ఉన్న ఒక్క గ్రామం మాత్రమే. ఆ గ్రామం పేరు బిసాదా. కానీ మీడియాకి బిసాదా అన్న పేరు పెద్దదిగా అనిపిస్తోందో లేక గుర్తుంచుకోవడం కష్టమనిపిస్తోందేమో, మూడక్షరాల కన్నా రెండక్షరాలు మంచిదనుకున్నారేమో, దానికి దగ్గరే ఉన్న దాద్రీ అనే ఊరు పేరు ఆ ఊరికి వీళ్లు పెట్టేశారు. జ్యోతి పాండే అనే అమ్మాయి కి మీడియా నిర్భయ అన్న ముద్దుపేరు పెట్టుకుంది. ఆ తరువాత ఆమె అసలు పేరు బయటపడినా "మేం పెట్టిన పేరు కాబట్టి జ్యోతి పాండే గీతి పాండే జాన్తానై. ఆమె పేరు నిర్భయే" అన్నది ఆ వర్గం. అదే రూలు ప్రకారం ఇప్పుడు కూడా బిసాదాని దాద్రీగా చెలామణీచేసేస్తోంది మీడియా.

మీడియా సమస్యేమిటంటే గుప్పెడు మంది జర్నలిస్టులు ఏజెండా నిర్ణయిస్తారు. ఏది వార్తో ఏది కాదో నిర్ధారిస్తారు. ఆ వార్తను ఎంత ఎత్తు ఎక్కించాలో, ఎప్పుడు దించాలో నిర్ధారిస్తారు. మిగతా మీడియా కేవలం గొర్రెల మందలా ఆ కొద్దిమంది వెనుక ప్రయాణిస్తారు. బిసాదా (దాద్రీ) విషయంలోనూ ఇదే జరిగింది. గత పదిహేను రోజుల్లో 125 కోట్ల మంది దేశంలో రెండవ దాద్రీ జరిగిన దాఖలాలు లేవు. అయినా ఇప్పటికీ దాద్రీయే ప్రధానవార్త. ఇది జర్నలిజమా, కాంగ్రెస్, కుహనా సెక్యులర్ స్వార్థ వర్గపు పాలేరుదనమా అన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

ఆ గ్రామంలో గోమాంసం తిన్నందుకు ఒక వ్యక్తిని కొందరు కొట్టి చంపేశారు. మరొకరిని గాయపరిచారు. దీన్ని ఎవరూ సమర్థించరు. కానీ మీడియా అత్యుత్సాహం ఆఖరికి దాద్రీ ప్రజలకు సైతం కోపం తెప్పించింది. వాళ్లు మీడియాపై రాళ్లు విసిరారు. నేపాల్ లో రాళ్లు విసిరించుకున్న తరువాత దాద్రీ (బిసాదా) లోనూ రాళ్లు విసిరించుకుని రచ్చ మాత్రమే కాదు, ఇంటా రచ్చ రచ్చేననినిరూపించుకుంది ఆ వర్గం మీడియా. ఈ కేసులో పోలీసుల అత్యాచారాలు భరించలేక జయప్రకాశ్ అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నారు. కానీ దాని గురించి ఈ స్వార్థపూరిత వర్గం రాయదు. నక్సల్స్ ని చంపిన పోలీసులకు వ్యతిరేకంగా మాత్రం తెగ వార్తలు వ్రాస్తుంది.


ప్రస్తుతం మీడియాకు తగ్గుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మెరుగవుతున్న ఆర్ధిక వ్యవస్థ, ప్రపంచంలో పెరుగుతున్న భారత్ ప్రతిష్ఠ వంటివేవీ పట్టవు. దాద్రీ యే దేశం. దాద్రీ మాత్రమే వార్త. నిన్న మొన్నటి దాకా వీరికి ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ ముకుతాడు వేసిన వైనం, సెక్యూరిటీ కౌన్సిల్ విషయంలో భారత్ విజయం వార్తలు కావు. కేవలం ఒక మీడియా సంస్థ యజమాని రెండో భార్య మూడు పెళ్లిళ్లలో మొదటి పెళ్లి వల్ల పుట్టిన అమ్మాయిని రెండో మొగుడితో కలిసి హత్య చేసిన దరిద్ర గొట్టు వార్తే వార్త. మోదీ సిలికాన్ వ్యాలీ ప్రసంగం వార్త కాదు. నరేంద్ర మోదీతో చేతులు కలిపిన తరువాత సత్య నాదెళ్ల తన చేతిని కర్చీఫ్ తో తుడుచుకోవడం మాత్రమే వార్త. తొలి సారి ప్రపంచ రేటింగ్ సంస్థలు భారత్ ను పొగుడుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో భారత్ చైనా, అమెరికాలను వెనక్కి నెట్టేసింది. స్వచ్ఛత తొలి సారి దేశం లో చర్చా విషయం అయింది. కానీ మమతా బెనర్జీ పాలించే పశ్చిమ బెంగాల్ లో కొందరు ముస్లింలు ఒక క్రైస్తవ నన్ పై రేప్ చేస్తే దానికి బిజెపిదే బాధ్యత అని పచ్చి అబద్ధాలు పరగడుపునే వినిపిస్తారు. దాద్రీ విషయంలోనూ పాలన సమాజ్ వాదీ పార్టీది. విమర్శించాల్సింది ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని. కానీ అఖిలేశ్ యాదవ్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ దాకా, ఆనంద్ శర్మ నుంచి అబ్రార్ అహ్మద్ దాకా అందరూ బిజెపిపై విరుచుకుపడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ ఎంతో హుందాగా "హిందూ ముస్లింలు పోరాడాల్సింది పేదరికంపై" అన్నారు. కానీ ఈ కాకి గోలలో ఆ మంచి మాటను వినిపించనీయడం లేదు.


నిజానికి దాద్రీ (బిసాడా) సంఘటనలో అది గో మాంసమా కాదా? ఇంతకీ అఖ్లాక్ అనే వ్యక్తి దాన్ని తిన్నాడా లేదా? ఆ గో మాంసం పొరుగింట్లో తప్పిపోయిన గోవుకి చెందినదేనా? అఖ్లాక్ ని హత్య చేసిందెవరు? ఆ వ్యక్తికి, అఖ్లాక్ కి మధ్య ఏవైనా పాత గొడవలున్నాయా? వంటి అంశాలపై దర్యాప్తు జరగాలి. కానీ ఇవేవీ జరగకుండానే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీని దీనికి బాధ్యుడిని చేసేస్తున్నాయి ఒక వర్గం మీడియా, దాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్, కుహనా సెక్యులర్ శక్తులు. ఈ దుష్ట ఏజెండాని గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశంలో మతకల్లోలాలు తగ్గుతున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మత ఘర్షణలు చాలా తక్కువ. ఇవి ప్రభుత్వ (పదేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన లెక్కలు ఇవి) లెక్కలు. వీటన్నిటినీ మించి కేంద్ర హోం శాఖకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై పంపిన నివేదికలో గో మాంసం గురించిన ప్రస్తావనే లేదు. ఇది బహిరంగ రహస్యం. తెలిసినా మీడియా , కాంగ్రెస్, కుహనా సెక్యులర్ పార్టీలు వీటి గురించి మాట్లాడటం లేదు. తమపై దాడి జరిగినప్పుడు హిందువులే తమను కాపాడారని ఒక ముస్లిం మహిళ స్వయంగా చెప్పింది. పైగా హత్య జరిగిన పది రోజులకు అదే ఊరిలో ఒక ముస్లిం యువతి వివాహం జరిగింది. దానికి భోజన ఏర్పాట్లన్నీ ఆ ఊరి హిందువులే చేశారు. హిందువుల పట్ల గౌరవంతో ముస్లింలు ఆ విందులో మాంసాన్ని తినలేదు. ఇది అదే బిసాదా (దాద్రీ) లో జరిగింది. ఆ ఊరి హిందువులు ముస్లింలు కలిసికట్టుగానే ఉన్నా మీడియా, కాంగ్రెస్, కుహనా సెక్యులర్ పార్టీలు మాత్రం వాళ్లను విడదీసి, చెడగొట్టే పనిలోనే తలమునకలవుతోంది. అన్నీ తెలిసినా నేరం మోదీ పైన, బిజెపి పైన ఉద్దేశపూర్వకంగా వేస్తున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీలో అయిదారు చర్చిలపై దాడులు జరిగాయి. మీడియా, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దీన్ని పెద్ద ఇష్యూ చేశాయి. ప్రచారం ప్రారంభించాయి. ఆఖరికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని కర్నాటకలోని మంగుళూరులో చర్చిపై దాడి జరిగితే దాన్ని కూడా బిజెపి నెత్తిన వేశాయి. బెంగాల్ లో నన్ రేప్ దోషం బిజెపిపై వేశాయి. చివరికి ఏం జరిగింది? ఇప్పుడా కేసు గురించి క్రైస్తవ మత నేతలు సైతం మాట్లాడటం లేదు. ఆప్, కాంగ్రెస్ లు అసలేమీ జరగనట్టు వ్యవహరిస్తున్నాయి. కుహనా మీడియా కిక్కురుమనడం లేదు. ఢిల్లీలోని అయిదు కేసుల్లో ఒక సంఘటన క్రికెట్ ఆడుతున్న పిల్లల బంతి తగిలి అద్దాలు పగలడం వల్ల జరిగిందని, ఇంకో సంఘటన చర్చిలోని మాజీ ఉద్యోగి (క్రైస్తవుడే) కోపంతో చేశాడని, ఒకటి మామూలు దొంగతనమని, మరో రెండు అసలు నిజాలే కాదని దర్యాప్తులో తేలింది. మంగుళూరు లో చర్చి లో దొంగతనానికి పాల్పడిన వారంతా క్రైస్తవులే అని తేలింది. ఇప్పుడు ఈ విషయంలో అంతా "ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబారు బుడ్డీ!!"

దాద్రీ (బిసాడా) ఉదంతం కూడా బీహార్ ఎన్నికల తర్వాత వార్తా పత్రికల హెడ్ లైన్ల నుంచి నెమ్మదిగా లోపలి పేజీలకు, ఆ తరువాత కొన్నాళ్లకు మీడియా సంస్థల న్యూస్ ఎడిటర్ల చెత్త బుట్టకు జారుకోవడం ఖాయం. అప్పటికి మీడియాకి ఇంకో అబద్ధం దొరుకుతుంది. దాన్ని బిజెపికి అంటగట్టి విషవమనం మొదలవుతుంది. కాంగ్రెస్, కుహనా సెక్యులరిస్తులకు భవిష్యత్తు ఎలాగూ లేదు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో మీడియా విశ్వసనీయత కథ కంచికెళ్తుంది.


5 comments:

  1. nice write up sir. need more such voices !

    ReplyDelete
    Replies
    1. Thanks... spread the truth... share the post.... we need to nail the paid media.....

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. There is no investigation and probing done by the media. The basics of Journalism are gone. What we perceive, we publish and there is no scope given to the other perspective.

      Delete
    2. sudhAkar gAru,

      mee blog writings aapakanDi, pls continue sir, its very good blog. I have been waiting for your next post since last november sir.

      Regards,
      -shashi kumar

      Delete

Pages