త్రిభువనమల్లుడి భోన్‌గిర్‌ కోట - Raka Lokam

త్రిభువనమల్లుడి భోన్‌గిర్‌ కోట

Share This

హైదరాబాద్‌ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తూంటే భువనగిరి బస్‌స్టాండ్‌కి ఎదురుగా కొండపైనున్న కోట మనల్ని తప్పకుండా పలకరిస్తుంది.....శతాబ్దాల ఎండావానల్నీ మోసిన ఆ కోట నా కథ చెబుతానంటూ పిలుస్తుంది.....కాగితాల క్యాలెండర్లు కాదు నా బండరాతి గుండెపై రాసుకున్న రాజకోట రహస్యాల గుట్టు విప్పుతాను రమ్మంటుంది.....

మెట్లదారి ఎక్కుతూంటే రాజులు రాజ్యాల తరాల పొరల్ని ఛేదించుకుంటూ శతాబ్దాలు వెనక్కి నడుస్తున్నటు అనిపిస్తుంది.....బురుజు మాటున, గోడ చాటున అలనాటి వీరుడెవరో నిలబడ్డారా అన్నట్టు అనిపిస్తుంది.....ఈ బురుజులపై నుంచి శత్రువు రాకడను గమనించే వారు కదా.....మైళ్ల దూరంలో రేగిన దుమ్మను చూసి శత్రువును గుర్తించి శతఘ్నులు సంధించేవారు కదా అనిపిస్తుంది....


సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తునరెండు కిలో మీటర్ల వైశాల్యంలో ఈ కోటను నిర్మించారు. ఈ కోటను చాళుక్య రాజైన ఆరవ త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు కట్టించాడని చరిత్ర చెబుతోంది. త్రిభువన మల్లుడి పేరిటే ఈ ఊరికి భువనగిరి అన్న పేరు వచ్చింది. అలనాటి శాతవాహనుల నుంచి నిజాం నవాబు దాకా పన్నెండు రాజవంశాల కథను ఈ కోట గోడలు, ఈ గుమ్మాలు ఈ బురుజులు చెబుతాయి.....


హైదరాబాద్‌ నవాబులపై దాడి చేసి గడగడలాడించిన సర్వాయి పాపన్న ఈ ప్రాంతం వాడే...ఆయన తన బలగాలతో నవాబులను వణికించాడు... మహారాష్ట్రలో బడుగు మావళీలను సమీకరించి ఛత్రపతి శివాజీ పోరాటం జరుపుతున్న సమయంలోనే కల్లు గీత కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్‌ బడుగుల సేనకు ప్రాణం పోశాడు.....పన్నెండు మంది మిత్రులతో మొదలైన సేన మూడువేలకు పెరిగింది.....మొగలుల పన్ను వసూలును, దౌర్జన్యాన్ని సవాలు చేశాడు...నవాబులు జమీందార్లను దోచాడు....ఆ సొమ్ము పేదలకు పంచాడు.....కోటల్ని కొల్లగొట్టాడు....ఆ డబ్బు గ్రామాల్లో ఇచ్చేశాడు.....పాపన్నలో ఓ గెరిల్లా యుద్ధ వీరుడు శివాజీ, మంచి దొంగ రాబిన్‌హుడ్‌, రాక్షస కాయుడైన గోలయత్‌ను ఎదుర్కున్న చిట్టి డేవిడ్‌లు కలగలిసి కనిపిస్తారు....స్థానికులు ఈ కోటలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.....



ప్రధానంగా ఇది డిఫెన్సివ్‌ కోట....రక్షణ కోసమే కట్టిన కోట ఇది.....లోపలకి వెళ్ళాలంటే మూడు ద్వారాలను దాటి వెళ్ళాలి....కోట చుట్టూ పన్నెండు ఫిరంగులుండేవి. నిజాంకు ఎప్పుడూ 800 మంది అంగరక్షకులుండేవారట.ఆయన గర్‌ మహల్‌ అనే భవంతిని కూడా కట్టించుకున్నారు. అక్కడ ఎప్పుడూ చల్లని గాలులు వీచేవి....నిజాం రహస్య మంతనాలు ఇక్కడే సాగేవి...

కొండపైన వంటశాల ఉంది. దీనినుంచి పొగ బయటకి వెళ్ళడానికి వీలుగా వెంటిలేషన్‌ కూడా ఉండటం విశేషం...ఇది అలనాటి అశ్వశాల....రాజులు, సైనికుల గుర్రాలు ఇక్కడే సేదతీరేవి....కొండపై ఒక కోనేరు కూడా ఉంది....ఈ ఏకశిలా పర్వతంపైన ఏర్పడ్డ కోనేరులో ఎప్పుడూ నీరుండటం ఒక విశేషం....

కోటలోని ఫిరంగులు కొన్ని దొంగల పాలయ్యాయి....కొన్ని పాడువడిపోతున్నాయి....కోట వెనుక భాగం కూడా దెబ్బతిన్నది. నిర్లక్ష్యం వల్ల కొంత సంపద పోయింది. ఇన్ని పోయినా కొండ మీద కోటను చూస్తే చాలు ప్రాణం లేచొస్తుంది.

కాళ్లకి పని పెట్టండి... కొండ మీదకి ఎక్కండి... కోటను చూడండి.

3 comments:

  1. A charitra chusina emunnadi garvakaranam mana jati samastam para peeda paraayanam

    ReplyDelete
  2. Anna, Peeda unna chote tirugu batu untundi...

    ReplyDelete
    Replies
    1. Peeda undi tirugubaatu cheyyaleni jaati... manadi kaadu

      Delete

Pages